ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) లో సిట్ విచారణకు కేసీఆర్ -KCR హాజరై 24 గంటలు గడవక ముందే ఆయన కుమార్తె, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -Kavitha బాంబుపేల్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) తనను విచారణకు పిలిస్తే హాజరయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు.
తన ఫోన్, తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు అనుమానాలున్నాయని చెప్పారు కవిత. ఓవైపు సిట్ ఎంక్వైరీని కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా తప్పుబడుతున్న టైంలో కవిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ ఎంక్వైరీని తప్పుబట్టడం ఏంటని ప్రశ్నించారు. చట్టబద్దమైన వ్యవస్థలను గౌరవించాలని, అసలు విచారణే జరగవద్దని ఎలా అంటారని పరోక్షంగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో సిట్ ఎంక్వైరీలో ఏం జరిగిందనేది కేసీఆర్ చెబుతారని అన్నారు కవిత. పనిలో పనిగా రేవంత్ రెడ్డి (Revanth reddy)తో హరీష్ (Harishrao) కుమ్మక్కయ్యాడని ఆరోపించారు.

ఇంకా ఏమన్నారంటే..
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పారదర్శకంగా జరగాలి.
గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నందునే సిట్ విచారణకు పిలిచింది.
చట్ట బద్ద వ్యవస్థలు విచారణకు పిలిస్తే పోక తప్పదు. చట్టాలన్ని అందరూ గౌరవించాలి.
నాతోపాటు నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయి
పార్టీ ఎవరిని నిలబెట్టినా ఓటేయాలని కేటీఆర్ చెప్పడం సరికాదు
చెడ్డ వాళ్ళకి ఓటు వేయాలని కేటీఆర్ చెప్తున్నారా.?
కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం
మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు గుణం చూసి ఓటేయండి.
పని చేసేవారికి, మంచి పనులు చేసేవారికి ఓటు వేయాలి.
తెలంగాణ జాగృతి తరఫున పలువురు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారు.
ఫిబ్రవరి 20 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం చేపడతాం.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తాం
కాంగ్రెస్ తో గుంటనక్క హరీశ్ రావు కుమ్మక్కయ్యారు.
